
తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ప్రతీ నెలా పించన్లను అందిస్తోంది. ఇక డయాలసిస్ పేషెంట్స్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కూడా పింఛన్ పంపిణీ చేస్తోంది. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న ముఖ్య పథకాల్లో చేయూత స్కీమ్ ఒకటి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కొత్త పింఛన్లను అందించనున్నట్లు ఇటీవల అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ క్రమంలో అసలు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అర్హతలు ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం.
అర్హతలు ఏంటి..?
-వృద్దాప్య పింఛన్కు వయస్సు 57 ఏళ్ల లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి
-ఇతర పింఛన్ పథకాల ద్వారా లబ్ది పొందుతూ ఉండకూడదు
-ఇక దివ్యాంగులకు వైకల్యం 40 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ప్రభుత్వ వైద్యులచే ధృవీకరించడ్డ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి
-ఇక వితంతు పింఛన్ కోసం భర్త డెట్ సర్టిఫికేట్ ఉండాలి. వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి
-బీడీ కార్మికులు పింఛన్ పొందాలంటే వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. గుర్తింపు పొందిన బీడీ పరిశ్రమలో పని చేస్తూ ఉండాలి
-ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పించన్ పొందాలంటే ఎలాంటి వయో పరిమితి లేదు
-ఇక డయాలసిస్ పేషెంట్లకు కూడా వయోపరిమితి లేదు
-ఇక బోధనేతర సిబ్బంది పింఛన్ పొందాలంటే ప్రభుత్వ లేదా ఎయిడెడ్ విద్యాసంస్థల్లో తక్కువ వేతనం పొందుతున్నవారు అర్హులు. వయస్సు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి
కావాల్సిన డాక్యుమెంట్లు
ఆధార్, మొబైల్ నెంబర్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజు ఫొటో, రేషన్ కార్డు, ఇన్ కమ్ సర్టిఫికేట్, ఓటర్ ఐడీ
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
ప్రజా పాలన కేంద్రాలు, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయం, మున్సిపల్ ఆఫీసుల నుంచి దరఖాస్తులను తీసుకోవాలి. వాటిని పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లతో పాటు గ్రామ పంచాయతీ, మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల్లో సబ్మిట్ చేయాలి. అధికారులు పరిశీలించి అర్హుల జాబితాలో చేరుస్తారు.
పింఛన్ ఎంత..?
ప్రతీఒక్కరికీ నెలకు రూ.4 వేలు అందిస్తారు. మీ గ్రామానికి అధికారులు వచ్చి వీటిని అందిస్తారు. మీరు స్థానికంగా అందుబాటులో లేకపోతే మూడు నెలల పింఛన్ ఒకేసారి తీసుకోవచ్చు.
త్వరలో కొత్త పింఛన్లు
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కొత్తగా లక్ష మందికి పింఛన్లను అందిస్తోంది. అయితే 2026-27 ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల మందికి పింఛన్లను అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇటీవల బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది.