టాలీవుడ్ సినీ చరిత్రలో ఎందరో నటులు వెలిగిపోయారు, కానీ అందరి జీవితాలు సుఖవంతంగా సాగలేదు. ముఖ్యంగా 90వ దశకంలో ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో తనదైన హాస్యంతో మెప్పించిన నటుడు 'ఐరన్ లెగ్' శాస్త్రి. ఆయన అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి.
'అప్పుల అప్పారావు' సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఎంతగా పాపులర్ అయిందంటే, అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అయితే తెరపై అందరినీ నవ్వించిన ఆ హాస్య నటుడి నిజ జీవితం మాత్రం అత్యంత దయనీయంగా ముగిసింది. ఆయన చివరి రోజుల్లో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం వర్ణనాతీతం. 2006లో ఆయన చనిపోయినప్పుడు కనీసం అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని స్థితిలో ఆ కుటుంబం ఉందంటే అతిశయోక్తి కాదు.
ఆ సమయంలో ఆయన భార్య, కుమారుడు ప్రసాద్ పడిన కష్టాలు చూసి సినీ లోకం విచారం వ్యక్తం చేసింది. అయితే తండ్రికి ఉన్న 'ఐరన్ లెగ్' అనే ట్యాగ్ ప్రసాద్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆయన కూడా సినిమా రంగంలోకి రావాలని ప్రయత్నించినప్పుడు, ఆ పేరు అపశకునమని భావించి ఎవరూ అవకాశాలు ఇచ్చేవారు కాదట. కనీసం బ్రాహ్మణుడిగా పౌరోహిత్య కార్యక్రమాలకు వెళ్లినా, ఆ పేరు వినగానే జనం దూరం పెట్టేవారట.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రసాద్కు నటుడు కాదంబరి కిరణ్ దేవుడిలా అండగా నిలిచారు. సినీ పరిశ్రమలోని 'మనం సైతం' సంస్థ ద్వారా ఆయనకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, ఉన్నత చదువులు చదవమని ప్రోత్సహించారు. తన తండ్రి పడిన కష్టాలను చూసిన ప్రసాద్, ఎలాగైనా స్థిరపడాలనే పట్టుదలతో కష్టపడి చదివి సీఏ (CA),ఎంబీఏ (MBA) పూర్తి చేశారు. నేడు ఆయన ఒక ప్రముఖ సంస్థలో ఉన్నత ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని గౌరవప్రదంగా చూసుకుంటున్నారు.
సినిమా గ్లామర్ వెనుక ఉండే చీకటి కోణాన్ని చవిచూసిన ప్రసాద్, ఆ కష్టాల నుంచి బయటపడి నేడు ఒక విజేతగా నిలిచారు. ఐరన్ లెగ్ శాస్త్రి వారసుడిగా కాకుండా, తన స్వయంకృషితో ఒక గుర్తింపును సాధించిన ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ క్రమంలో ఆయనకు తోడుగా నిలిచిన కాదంబరి కిరణ్ వంటి వారిని కూడా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.




