
భారతీయ రహదారుల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లించే వెసులుబాటును నిలిపివేసింది. దేశంలోని అన్ని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అమలు చేస్తూ ఎన్ హెచ్ఎఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుము చెల్లింపులు ఇకపై పూర్తిగా ఫాస్టాగ్, యూపీఐ విధానం ద్వారా జరగనున్నాయి. ఈ నూతన విధానం నేటి నుండి (ఏప్రిల్ ఒకటో తేదీ) నుంచి అమల్లోకి తీసుకు వచ్చింది..
ప్రస్తుతం వాహనదారులు దాదాపుగా 98 శాతం వరకు ఫాస్టాగ్ విధానం (ఫాస్టాగ్, యూపీఐ) లో టోల్ చార్జీలు చెల్లిస్తున్నారు. మిగిలిన రెండు శాతం మంది వాహన దారులు మాత్రమే నగదు చెల్లిస్తున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇక తాజా నిర్ణయంతో ఆ రెండు శాతం వాహనదారులు కూడా ఆన్ లైన్ పద్ధతిలోకి రానున్నారు.
ఇకపై టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు తమ ఫాస్టాగ్ (FASTag) ద్వారా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ (UPI) ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా లేదా అందులో తగినంత బ్యాలెన్స్ లేకపోయినా జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర రహదారుల్లోని టోల్ ప్లాజాల వద్ద మాత్రం ఈ విధానం అమల్లోకి తీసుకురాలేదు. అక్కడ నగదు చెల్లింపులకు అనుమతిస్తారు. హైవేలపై టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత ప్రయాణంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం, టోల్ వసూళ్లలో పారదర్శకత కోసం నగదు చెల్లింపుల విధానాన్ని రద్దు చేసినట్లు హైవే అథారిటీ అధికారులు చెబుతున్నారు. నెట్వర్క్ సమస్యల కారణంగా యూపీఐ లావాదేవీలు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చని, కాబట్టి ఫాస్టాగ్ను ఎల్లప్పుడూ రీఛార్జ్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..