వ్యాపారాలకు ఊరట.. జన్ విశ్వాస్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

వ్యాపారాలకు ఊరట.. జన్ విశ్వాస్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం


వ్యాపారాలకు ఊరట.. జన్ విశ్వాస్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం, చిన్న తప్పిదాలపై క్రిమినల్ కేసుల భారాన్ని తగ్గించడం లక్ష్యంగా రూపొందించిన ‘జన్ విశ్వాస్ (సవరణల) బిల్లు–2026’కు పార్లమెంట్ గురువారం పూర్తి స్థాయిలో ఆమోదం లభించింది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభ కూడా వాయిస్ ఓటుతో ఆమోదించింది. చర్చకు సమాధానంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ మార్పులు సాధారణ ప్రజలు, సూక్ష్మ-చిన్న మధ్యతరహా పరిశ్రమలకు బాగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ బిల్లు పరిధి విశాలంగా ఉండడం విశేషం. మొత్తం 80 కేంద్ర చట్టాలకు సవరణలు చేస్తూ, 79 చట్టాల్లోని 784 నిబంధనలను పునర్‌వ్యవస్థీకరిస్తోంది. 23 మంత్రిత్వ శాఖలకు చెందిన చట్టాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిలో ముఖ్యంగా 717 నిబంధనల్లో చిన్న ఉల్లంఘనలకు క్రిమినల్ శిక్షలను తొలగించి, 67 నిబంధనల ద్వారా ‘సులభ జీవనం’కు అనుకూల మార్పులు చేయనున్నారు. ఈ బిల్లులో ప్రధాన మార్పు జైలు శిక్షల స్థానంలో సివిల్ జరిమానాలను ప్రవేశపెట్టడమే. ఉదాహరణకు, ఔషధాలు-కాస్మెటిక్స్ చట్టం కింద ఉన్న కొన్ని ఉల్లంఘనలకు ఇప్పటివరకు జైలు శిక్ష ఉండగా, ఇకపై భారీ జరిమానాతో సరిపెడతారు. అలాగే జాతీయ రహదారుల చట్టం కింద రహదారిని ప్రమాదకరంగా మార్చిన వారికి ఉన్న జైలు శిక్షను తొలగించి, రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు జరిమానా విధించేలా మార్పులు చేశారు.

కొన్ని చట్టాల్లో పూర్తిగా జైలు శిక్షలను తొలగించారు. ఇండియన్ సక్సెషన్ చట్టం, విద్యుత్ చట్టం వంటి వాటిలో చిన్నపాటి నేరాలకు ఇకపై జైలుశిక్ష ఉండదు. అంతేకాదు, కొన్ని నేరాలను పూర్తిగా రద్దు చేశారు. తప్పుడు ఫైర్ అలారం ఇవ్వడం, పుట్టిన-చనిపోయిన వివరాలు నమోదు చేయకపోవడం, కాపీరైట్ రిజిస్టర్‌లో తప్పులు నమోదు చేయడం వంటి అంశాలను నేరాల జాబితా నుంచి తొలగించారు. జరిమానా వ్యవస్థను కూడా సవరించారు. ప్రతి మూడు సంవత్సరాలకు కనీస జరిమానాను 10 శాతం పెంచే విధంగా నిబంధనలు తీసుకొచ్చారు. అదే సమయంలో మొదటిసారి చేసిన తప్పులకు హెచ్చరికలు, రెండోసారి చేసినప్పుడు సూచనలు, ఆ తర్వాతే జరిమానాలు విధించే విధంగా ‘గ్రేడెడ్ కంప్లయెన్స్’ విధానాన్ని ప్రవేశపెట్టారు.

చట్ట అమలులో పారదర్శకత కోసం విచారణాధికారులు, అప్పీల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ చట్టంలో ఆస్తి పన్ను వ్యవస్థలో మార్పులు, విలువ నిర్ణయ కమిటీ ఏర్పాటు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు వంటి చర్యలు కూడా ఈ బిల్లులో భాగమయ్యాయి. మొత్తం మీద చిన్నపాటి తప్పిదాలకు జైలు భయం తొలగించి, వ్యాపారాలకు సౌలభ్యం కల్పించే దిశగా ఈ ‘జన్ విశ్వాస్’ బిల్లు కీలక అడుగుగా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *