
అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరంలో అరుదైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది. నిజాం పట్టణానికి చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా.. అరుదుగా కనిపించే సీదా సందువా చేప వలకు చిక్కడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చేపను అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్కు తీసుకురాగా.. దాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సుమారు 3.6 కిలోల బరువున్న ఈ సందువా చేప కోసం వ్యాపారులు పోటీ పడి చివరకు దాన్ని సుమారు రూ.3 వేల వరకు కొనుగోలు చేశారు.
సీదా సందువా చేప సాధారణంగా సముద్ర గర్భంలో లోతైన ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుందని, అందుకే ఇది చాలా అరుదుగా మత్స్యకారుల వలకు చిక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చేపకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా చైనా, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో దీనికి అధిక ధర లభిస్తుందని వ్యాపారులు తెలిపారు.
ఆరోగ్యపరంగా కూడా ఈ చేపకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉందని, ఇందులో ప్రోటీన్లు, పోషకాలు సమృద్ధిగా ఉండటంతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అందుకే దీనిని ‘విలువైన సముద్ర సంపద’గా భావిస్తారు. అరుదుగా దొరికే ఈ సందువా చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతుండగా… మత్స్యకారులకు ఇది మంచి ఆదాయం అందించే అవకాశం కల్పించింది. సముద్రంలో ఇలా అరుదైన చేపలు లభించడం తమ అదృష్టమని మత్స్యకారులు తెలిపారు.
Also Read: హైవేపై అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన DCM వాహనం.. తనిఖీ చేయగా..