
మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అని మరోసారి రుజువు అయింది. రక్తం పంచుకు పుట్టిన సోదరుల మధ్య ఆస్తుల విభేదాలు తలెత్తాయి. చివరకు హత్య వరకు దారి తీయడం సంచలనంగా మారింది. దైవభక్తుడు అనే వ్యక్తిని సొంత తమ్ముడు విజయరాజు దారుణంగా హతమార్చాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఆళ్లగడ్డ మండలం ఆర్. కృష్ణాపురంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తికోసం సొంత అన్ననే కడతేర్చాడు ఓ తమ్ముడు. ఎస్సీ కాలనీకి చెందిన దైవ భక్తుడు (40) ను తమ్ముడు విజయరాజు అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఆస్తి పంపకాలపై తరచూ ఈ అన్నదమ్ములు గొడవ పడుతున్నారు. ఈ కోవలోనే శనివారం (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన ఘర్షణలో సొంత అన్న దైవభక్తుడును రోకలిబండతో కొట్టి చంపాడు తమ్ముడు విజయరాజు. ఈ ఘర్షణలో అడ్డొచ్చిన మరో ఇద్దరు అన్నదమ్ములను సైతం విజయరాజు గాయపరిచాడు.
తీవ్రంగా గాయపడ్డ దైవభక్తుడు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్ళగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరు అన్నదమ్ములు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు విజయరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..