World Cup 2027కు టీమిండియా తుది జట్టు ఇదే..! ఆ ముగ్గురు స్టార్లకు హ్యాండిచ్చేసిన గంభీర్, అగార్కర్?

World Cup 2027కు టీమిండియా తుది జట్టు ఇదే..! ఆ ముగ్గురు స్టార్లకు హ్యాండిచ్చేసిన గంభీర్, అగార్కర్?


Indian Cricket Team: క్రికెట్ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు సమయం దగ్గరపడుతోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఎలా ఉండబోతోంది? రోహిత్, కోహ్లీలు ఆడతారా? యువ కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగే ఆ బలమైన ‘ప్లేయింగ్ 11’, జట్టులో చోటు కోల్పోయే ఆ ముగ్గురు ఆటగాళ్లను ఓసారి చూద్దాం..

దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ మూడో ప్రపంచకప్ వేట..

భారత క్రికెట్ చరిత్రలో 1983, 2011 సంవత్సరాలు సువర్ణాక్షరాలతో లిఖించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడోసారి ప్రపంచ విజేతగా నిలవాలని భారత్ పట్టుదలతో ఉంది. 2027 అక్టోబర్-నవంబర్ మాసాల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిచ్చే ఈ టోర్నీలో అక్కడి పిచ్‌లు వేగవత్తంగా, బౌన్సీగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో అనుభవం, ఆవేశం కలగలిసిన జట్టు భారత్‌కు ఎంతో అవసరం.

యువ సారథి.. వెన్నుదన్నుగా సీనియర్లు..

ఈ ప్రపంచకప్‌లో భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఓపెనర్‌గా గిల్ తన బాధ్యతను నెరవేరుస్తుండగా, అతడికి తోడుగా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నాడు. ఇక మూడో స్థానంలో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ జట్టుకు ప్రధాన బలంగా నిలుస్తాడు. రోహిత్, కోహ్లీలకు ఇది చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉన్నందున, తమ కెరీర్‌ను ఘనంగా ముగించాలని వారు పట్టుదలతో ఉన్నారు.

పటిష్టమైన మధ్యస్థాయి బ్యాటింగ్..

మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ భుజాలపై ఉండనుంది. వికెట్ కీపర్‌గా రాహుల్ అనుభవం జట్టుకు అదనపు బలం. ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా ఫినిషర్‌గా, నాలుగో పేసర్‌గా కీలక పాత్ర పోషిస్తారు. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా కంటే మెరుగైన బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న అక్షర్ పటేల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

బౌలింగ్ దళం: వేగం, స్పిన్ మ్యాజిక్..

దక్షిణాఫ్రికా పిచ్‌లపై పేసర్లు కీలకం. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో మహమ్మద్ సిరాజ్, యువ పేసర్ హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు పంచుకుంటారు. స్పిన్ మ్యాజిక్ కోసం కుల్దీప్ యాదవ్ జట్టులో ప్రధాన స్పిన్నర్‌గా ఉంటారు. అక్షర్ పటేల్ అతడికి తోడవుతారు.

ఈ ముగ్గురు స్టార్లకు నిరాశ తప్పదా?

పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వంటి దిగ్గజాలకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. జైస్వాల్ ప్రతిభావంతుడైనప్పటికీ రోహిత్-గిల్ జోడీ వల్ల, జడేజా కంటే అక్షర్ మెరుగైన ఫామ్‌లో ఉండటం వల్ల వీరు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది.

ప్రపంచకప్ 2027 కోసం భారత అంచనా జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *