యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్సన్ టు వ్యాపారి మధ్య జరిగే లావాదేవీలపై డిస్కౌంట్ మర్చంట్ రేటు(MDR) ఛార్జీలు అమల్లోకి తెస్తున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. పర్సన్ టు వ్యాపారి మధ్య జరిగే రూ.2 వేలకుపైబడి పేమెంట్లపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలు విధించింది. ఇక రైల్వే టికెట్ల బుకింగ్, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన చెల్లింపులపై రూ.5 ఛార్జీ ఉంటుంది. రూ.2 వేలలోపు లావాదేవీలపై ఎలాంటి ఛార్జీ ఉండదు. ఇక పర్సన్ టూ పర్సన్ మధ్య జరిగే లావాదేవీలు పూర్తిగా ఉచితం. అయితే ఎండీఆర్ ఛార్జీలు అనేవి కస్టమర్లు చెల్లించాల్సిన పని లేదు. మీ నుంచి డబ్బు స్వీకరించడానికి వ్యాపారి దీనిని బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రజలపై ఎలాంటి భారం పడదని కేంద్రం చెబుతోంది. అంతేకాకుండా ఈ ఛార్జీలు చెల్లించాల్సిందిగా కస్టమర్లను వ్యాపారులు బలవంతపెట్టకూడదు.
ఛార్జీలు వేటిపై ఉంటాయంటే..?
-రైల్వేలు, టెలికమ్యూనికేషన్లు, బీమా, ఇంధనం, వ్యవసాయ ఉత్పాదకాలు, నిత్యావసర, తక్కువ లాభదాయక రంగాల్లో రూ. 2 వేలుపైబడిన ట్రాన్సాక్షన్లపై రూ.5 ఫ్లాట్ రేటు విధిస్తారు.
-మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీలు, స్టాక్ బ్రోకర్లు, డీలర్ల వద్ద రూ.2 వేలకుమించి ట్రాన్సాక్షన్లు చేస్తే 0.02 శాతం MDR రేటు వర్తిస్తుంది. ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ. 300 వరకు ఉంటుంది.
-ఉదాహరణకు కుటుంబంతో కలిసి ఒక రెస్టారెంట్కు వెళ్లి ఫుడ్ తిన్నారు. బిల్లు రూ. 6 వేలు అయిందనుకుందాం. మీరు రూ.6 వేలు చెల్లిస్తే.. 0.4 శాతం చొప్పున రూ. 24 ఛార్జీలు పడతాయి. దీనిని కస్టమర్ చెల్లించాల్సిన పని లేదు. రెస్టారెంట్ చెల్లించాల్సి ఉంటుంది.
-రూ. 30 వేలు ఖరీదు చేసే మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే 0.4 శాతం చొప్పున రూ.120 పడుతుంది. దీనిని షాపు యజమాని చెల్లించాల్సి ఉంటుంది.
మిమ్మల్ని కట్టమని అడుగుతున్నారా..?
ఒకవేళ వ్యాపారి ఎండీఆర్ ఛార్జీలు చెల్లించాల్సిందిగా బలవంతపెడితే కస్టమర్లు చెల్లించాల్సిన పని లేదు. ఈ మేరకు బ్యాంకులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల నుంచి తీసుకోకుండా చూసుకోవాలని సూచించింది. అలాగే యూపీఐ ప్రొవేడర్లు ఫ్లాట్ఫామ్ ఫీజులు, దాగి ఉన్న ఛార్జీలను విధించడం నిషేధించింది. రూ.2 వేల పరిమితి వల్ల వ్యక్తి, వ్యాపారుల మధ్య జరిగే లావాదేవీల్లో 96 శాతం ఉచితంగా లభిస్తాయని, కేవలం 4 శాతం వ్యాపార లావాదేవీలపై మాత్రమే చార్జీలు విధిస్తున్నామని కేంద్రం చెబుతోంది. చిన్న వ్యాపారులకు దీని వల్ల ఎలాంటి నష్టం ఉండదని చెబుతోంది. ఇక చిరు వ్యాపారాల్లో యూపీఐ వినియోగాన్ని పెంచేందుకకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఎండీఆర్ ఛార్జీల్లో 5 శాతంను ఈ నిధి కేటాయిస్తామని తెలిపింది.