Headlines

మసీదు ప్రార్థనా సమయంలో భారీ పేలుడు.. 16 మంది మృతి.. 50 మందికి సీరియస్!


పాకిస్తాన్‌లో మరోసారి భారీ పేలుడు కలకలం రేపింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కోహట్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. పోలీస్ లైన్స్ సమీపంలో శుక్రవారం (సెప్టెంబర్ 18) జరిగిన అనుమానిత ఆత్మాహుతి దాడిలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది పౌరులు, ఐదుగురు పోలీసు సిబ్బంది ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

శుక్రవారం ప్రార్థనల సమయంలో మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు ఉన్నతాధికారి జుల్ఫికర్ హమీద్ ప్రకారం.. పేలుడు పదార్థాలతో నింపిన వాహనం ఓల్డ్ పోలీస్ లైన్స్ గేటును ఢీకొట్టింది. అనంతరం సమీపంలోని మసీదు గోడను ఢీకొని పేలిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు.

పేలుడు ధాటికి మసీదు గోడ కూలిపోవడంతో సమీప భవనాలు కూడా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని కోహట్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

పేలుడుకు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. పేలుడు అనంతరం పోలీస్ లైన్స్ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కోహట్-హంగూ రహదారిపై వాహనాల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *