
సైబీరియన్ పక్షులు సందడి చేస్తున్నాయి. ఎక్కడో రష్యాలో వుండే సైబీరియన్ పక్షులు ఖండాంతరాలు దాటీ తమజాతిని పెంచుకునేందుకు కర్నూలును ఆవాసంగా చేసుకుంటున్నాయి. వేలాది పక్షులు రంగు రంగుల శరీరాకృతిలో ఆకట్టుకుంటున్నాయి. కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు అందుకు వేదికగా మారింది.
కర్నూలు మండలంలో గార్గేయపురం చెరువు సమీపంలోనే నగర వనం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు చిట్టడవిని తయారు చేశారు. ఆ పక్కనే సహజంగా ఉన్న చెరువులో బోటింగ్ ఏర్పాటు చేశారు. సెలవుల్లో కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు నగరవాసులు ఇక్కడికి వస్తుంటారు. రష్యా లోని సైబీరియా ప్రాంతానికి చెందిన పక్షులు ఖండాంతరాలు దాటి కర్నూలు చేరుకున్నాయి. సైబీరియా పక్షులు రష్యాలోని అత్యంత శీతల వాతావరణం నుండి, శీతాకాలంలో వెచ్చని ప్రదేశాల కోసం వేలాది కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశానికి వస్తాయి. ఆహారం, అనుకూలమైన వాతావరణం కోసం భారత్ కు వస్తుంటాయి. సైబీరియాలో మంచు కారణంగా ఆహారం దొరకకపోవడం, తీవ్రమైన చలి కారణంగా ఈ పక్షులు వేటగాళ్ల నుండి తప్పించుకుని వెచ్చని ప్రదేశాలకు వలస వస్తాయి. ఏపీ లో కొల్లేరు సరస్సు, నేలపట్టు, పులికాట్ సరస్సు ,శ్రీకాకుళం జిల్లాలోని తేలినీలాపురం వంటి ప్రాంతాల్లో ఈ పక్షులు ఎక్కువగా సందడి చేస్తాయి. అయితే ఇప్పుడు కరువు నేల కర్నూలుకూ వలస వస్తున్నాయి. చేపలు, కీటకాలు, గడ్డి జాతి మొక్కల మొలకలను ఇవి ప్రధాన ఆహారంగా తీసుకుంటాయి.
రష్యాలో ప్రతికూల వాతావరణం నుంచి తప్పించుకునేందుకు, సంతాన ఉత్పత్తిని పెంచుకునేందుకు భారత్ కు వస్తున్నాయి. హిమాలయ పర్వతాలను దాటుతూ, సైబీరియా నుండి ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా, టిబెట్ మీదుగా ఈ పక్షులు మన దేశానికి వస్తున్నాయి. కర్నూలు మండలంలోని గార్గేయపురం చెరువులో సైబీరియన్ పక్షులు వేల సంఖ్యలో చేరుకున్నాయి. సైబీరియన్ విదేశీ పక్షుల సందడితో గార్గేయపురం కొత్త అందాలను సంతరించుకుంది. కొన్నేళ్లుగా సైబీరియన్ పక్షులు ఇక్కడికి వస్తున్నా క్రమంగా ఈ సంఖ్య పెరుగుతోంది. వాతావరణం, పక్షులకు భద్రత అనుకులంగా ఉండడంతో ఇక్కడికి వచ్చే పక్షుల సంఖ్య పెరుగుతోంది.
సైబీరియన్ పక్షులు తమ జాతి ఉత్పత్తికి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. ఖండతరాలు దాటి ఇక్కడికి చేరుకొని సురక్షిత ప్రాంతాన్ని ఎంచుకొని గుడ్లు పెడతాయి. గుడ్లు పొదిగేవరకు ఇక్కడే ఉంటాయి. ఒక్కో పక్షి రెండు నుంచి మూడు గుడ్లు పెడతాయి. చెట్లలో గూళ్లు కట్టినప్పటి నుంచి మగ పక్షి, ఆడపక్షి రెండూ కలిసే ఉంటాయి. ఆడపక్షి గుడ్లు పెడితే వాటికి రక్షణగా మగ పక్షి నిలుస్తుంది. పిల్లలుగా తరువాత తల్లి పక్షి ఆహారాన్ని తమ నోటి ద్వారా తీసుకువచ్చి పిల్లలకు అందిస్తాయి. ఇలా ఆహారం కోసం ఒక పక్షి బయటికి వెళితే.. మరో పక్షి పిల్లలకు రక్షణగా గూడులోనే ఉంటుంది. పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి మాత్రం పెద్ద పక్షులు బయటికి వెళ్లవు. సైబీరియన్ పక్షుల ఆవాసానికి గార్గేయపురం చెరువు వాతావ రణం ఎంతో అనుకూలంగా ఉంది. జనవరి లో ఇక్కడికి చేరుకొని సంతనోతపత్తిని పూర్తి చేసుకొని ఆగస్టులో తమ పిల్లలతో కలిసి తిరిగి రష్యా లోని సైబీరియా చేరుకుంటాయి. సైబీరియన్ పక్షులు గుంపులు గుంపులుగా చెరువు ఒడ్డున చెట్లపై కూర్చోవడం, ఆకాశంలో ఎగరడం వంటి దృశ్యాలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
Siberian Migratory Birds 2