మమతా బెనర్జీ గద్దె దిగే వరకు చెప్పులు లేకుండా నడిచిన తాడేపల్లి గూడెం మహిళ.. ఎందుకు?

మమతా బెనర్జీ గద్దె దిగే వరకు చెప్పులు లేకుండా నడిచిన తాడేపల్లి గూడెం మహిళ.. ఎందుకు?


ఏలూరు: కఠిన నిర్ణయాలు తీసుకున్నవారు, కఠోర శ్రమలు పడే వాళ్లు ఎవరైనా కనిపిస్తే.. అమ్మో భీష్మప్రతిజ్ఞ తీసుకున్నారంటాము. అలాంటి ప్రతిజ్ఞ తీసుకున్న వారిలో గాంధారి ఒకరు. భర్త చూడని లోకం తాను చూడనని ఆమె తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోయింది. ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఉంటారా అంటే అక్కడక్కడా మనకు తారస పడుతూనే ఉంటారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయే వరకు కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతానని తాడేపల్లి గూడెంకు చెందిన మహిళ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మమతా బెనర్జీ ఓటమి తరువాత కార్యకర్తలు ఆమెకు చెప్పులు కొనిపించారు. ఆ బీజేపీ మహిళా నేత ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమిపాలయ్యేంత వరకూ చెప్పులు వేసుకోనని శపథం చేశారు ఈ బీజేపీ నాయకురాలు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఘోర ఓటమి చెందడంతో 21 నెలల తర్వాత మంగళవారం చెప్పులు ధరించారు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి. గతంలో ఆమె పశ్చిమబెంగాల్లో పర్యటించారు. అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వం చేపడుతున్న అణచివేత ధోరణులు తనను తీవ్రంగా కలిచివేసాయనీ, ఆమె గద్దె దిగేదాకా చెప్పులు వేసుకోనని సంకల్పం చేసుకున్నానని భోగి రెడ్డి ఆదిలక్ష్మీ అంటున్నారు. ముఖ్యంగా ఆర్జికర్ ఆసుపత్రి ఘటనతో కలత చెందిన ఆమె ఈ సంకల్పం తీసుకున్నారు.

తాజా ఎన్నికల్లో భవానిపూర్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓటమి చెందారు. మమతా ఓటమి తర్వాత తన ఆకాంక్ష నెరవేరిందని ఆమె చెబుతున్నారు. ఆదిలక్ష్మి పాదరక్షలు లేకుండా 21 నెలలు పాటు పలుచోట్లకి తిరిగారు. చెప్పులు మర్చిపోయారా అంటూ సన్నిహితులు అడిగేవారని ఆమె తెలిపారు. చెప్పులు లేకుండా నడిస్తే సున్నితమైన నరాలపై భారం పడుతుందని, ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరించిన లెక్కచేయకుండా మమత ఓటమి కోసం ఎదురు చూశానని ఆదిలక్ష్మి ఉంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం కంటే ఆచరించటం చాలా కష్టం. కానీ, ఆదిలక్ష్మి పంతం తీరటంతో కుటుంబసభ్యులు, కార్యకర్తలు హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నారు.

బీజేపీ మహిళా నేత స్పీచ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *