Headlines

ఉద్యోగం కోసం వెళ్లి ఉచ్చులో చిక్కింది..! ఒమన్‌లో హైదరాబాద్ మహిళ నరకయాతన!

ఉద్యోగం కోసం వెళ్లి ఉచ్చులో చిక్కింది..! ఒమన్‌లో హైదరాబాద్ మహిళ నరకయాతన!


కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆశతో విదేశాలకు వెళ్లిన ఓ మహిళకు సరియైన ఉద్యోగం దక్కలేదు.. బదులుగా వేధింపులు, దోపిడీ, ఆకలి మాత్రమే మిగిలాయి. హైదరాబాద్‌కు చెందిన షబ్నం బేగం ఒమన్‌లో ఎదుర్కొన్న దారుణ పరిస్థితులు ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఆమెను స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్‌కు చెందిన షబ్నం బేగం అనే మహిళ ఉద్యోగం పేరుతో ఒమన్‌కు వెళ్లింది. స్థానిక రిక్రూట్‌మెంట్ ఏజెంట్ నెలకు 200 ఒమానీ రియాల్స్ జీతంతో ఇంటి పనిమనిషి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో ఆమె 2026 మార్చి 26న మస్కట్‌కు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఒమన్ చేరుకున్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు.

ఇంటి యజమాని ఆమెను రోజుకు 12 నుంచి 15 గంటల పాటు పలువురు ఇళ్లలో పనిచేయాలని బలవంతం చేశాడని, లేదంటే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు తగిన ఆహారం, వసతి కల్పించలేదని, నాలుగు నెలలుగా జీతం కూడా చెల్లించలేదని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా యజమాని తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని షబ్నం బేగం ఆరోపించినట్లు సమాచారం.

వేధింపులు భరించలేక యజమాని ఇంటి నుంచి తప్పించుకున్న షబ్నం ప్రస్తుతం మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నట్లు తెలిసింది. ఆమె భద్రతను నిర్ధారించి, వెంటనే హైదరాబాద్‌కు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు.

అలాగే తప్పుడు హామీలతో ఆమెను విదేశాలకు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిక్రూట్‌మెంట్ ఏజెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించే అవకాశముంది. సంబంధిత అధికారుల దర్యాప్తు అనంతరం పూర్తి వాస్తవాలు వెల్లడికానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *