Headlines

నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు! కమిషన్ నుంచి కీలక ప్రకటన

నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు! కమిషన్ నుంచి కీలక ప్రకటన


రాజేంద్రనగర్‌లోని ప్రధాన రహదారిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు దర్శనమివ్వడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. కిందపడి ఉన్న ఓఎంఆర్ షీట్లను చూసిన స్థానికులు, నిరుద్యోగ యువత ఆందోళనకు గురికావడంతో ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. దీనిపై తక్షణమే స్పందించిన టీజీపీఎస్సీ కమిషన్, అధికారుల నుంచి ప్రాథమిక వివరాలు సేకరించి, అసలు నిజాలేమిటో వివరిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

రోడ్డుపై లభ్యమైన ఓఎంఆర్ షీట్లు 2018 నాటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించినవని టీజీపీఎస్సీ సెక్రటరీ స్పష్టం చేశారు. ఆ నియామక ప్రక్రియ ఎప్పుడో పూర్తయిపోయిందని, నిబంధనల ప్రకారం మూడేళ్లు దాటిన పాత రికార్డులను, నిరుపయోగమైన ఓఎంఆర్ షీట్లను తొలగించి నిర్వీర్యం (శ్రెడ్డింగ్) చేయడం సాధారణ ప్రక్రియలో భాగమని వెల్లడించారు. శ్రెడ్డింగ్ కోసం కేటాయించిన ఆ పాత కాగితాలు పబ్లిక్ ప్లేస్‌లోకి ఎలా వచ్చాయనే దానిపై తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు.

ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు టీజీపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఓఎంఆర్ షీట్లు రోడ్డుపైకి రావడానికి గల కారణాలను అన్వేషించి, మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీజీపీఎస్సీ ఎస్పీని ఆదేశించింది. నివేదిక ఆధారంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా రికార్డుల నిర్వహణ, శ్రెడ్డింగ్ ప్రక్రియను మరింత కఠినంగా సమీక్షిస్తామని కమిషన్ వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *