
కర్నూల్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్లో కాల్పుల కలకలం రేగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఫైనల్ పోరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కౌశిక్ టీమ్ తీవ్ర ఉత్కంఠ మధ్య ఓటమి పాలైంది. ఈ మ్యాచ్కు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ హాజరుకాగా.. పెద్ద సంఖ్యలో నగరవాసులు పోటీలను వీక్షించేందుకు తరలివచ్చారు. ఓటమితో వ్యాపారి కౌశిక్ తీవ్ర అవమానం, నిరాశకు గురయ్యాడు. ఓటమిని తట్టుకోలేక తన వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీతో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆకస్మికంగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో మైదానంలో ఉన్న ప్రేక్షకులు, నిర్వాహకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. టీజీ వెంకటేష్పై ఏమైనా దాడి జరిగిందా అని అక్కడున్నవారంత ఆందోళన చెందారు. అయితే కౌశిక్ కేవలం ఓటమి భారంతో గాలిలోకి కాల్పులు జరిపినట్లు తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కొందరికి స్వల్ప గాయాలు.. అరెస్ట్ చేసిన పోలీసులు
గాలిలోకి జరిపిన కాల్పుల వల్ల ఎగిరిపడిన బుల్లెట్ రవ్వలు తగిలి అక్కడ ఉన్న కొద్దిమందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కౌశిక్ను అదుపులోకి తీసుకున్నారు. ‘‘విచారణలో ఓటమి భారాన్ని తట్టుకోలేక గాలిలోకి కాల్పులు జరిపినట్లు కౌశిక్ అంగీకరించాడు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశాం’’ అని డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన కౌశిక్ గన్ లైసెన్సును శాశ్వతంగా రద్దు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.