Headlines

Telangana: ఛీ.. ఛీ ఇలాంటి కొడుకు ఏ తల్లికి ఉండకూడదు.. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..


తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్న కొడుకే తల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ సైదాబీ అనే మహిళకు షేక్ సుభాని అనే కుమారుడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కొడుకుని కష్టపడి పెంచిన సైదాబీ, కొన్నేళ్ల క్రితమే అతనికి పెళ్లి కూడా చేసింది. అయితే పెళ్లైన కొన్నాళ్లకే సుభాని తాగుడుకి బానిస అవ్వడంతో ఏడాది క్రితమే అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది.

దీంతో సుభాని తల్లి వద్దే ఉంటూ రోజూ తాగేందుకు డబ్బులు కావాలని వేధించడం మొదలుపెట్టాడు. తాజాగా గురువారం కూడా తాగి వచ్చిన సుభాని.. ఇంకా తాగేందుకు డబ్బులు కావాలని తల్లితో గొడవ పెట్టుకున్నాడు. డబ్బులు ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన అతడు ఇంట్లో ఉన్న రోకలిబండ తీసుకొని తల్లిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం సుభాని అక్కడి నుంచి పరారయ్యాడు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *