Headlines

Hyderabad: కేపీహెచ్‌బీలో దారుణం.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య


హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఐదో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. కొంతకాలంగా మహిళ డిప్రెషన్‌తో ఉంటుందని, దాని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూస్తే..

కేరళలోని కానూర్‌కు చెందిన సోను పురుషోత్తమన్, శీతల్‌ దంపతులు తమ పిల్లలతో కలిసి కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తులో నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహం జరగ్గా.. నాలుగేళ్ల చిన్నారి ఉంది. భర్త ఎస్‌బీఐలో డీఎంగా పనిచేస్తుండగా.. భార్య గృహిణిగా ఉంది. అయితే శీతల్ గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతుండగా.. దీనికి మందులు కూడా ఉపయోగిస్తోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో టెర్రస్ ఎక్కే మెట్లపై 10 నిమిషాల పాటు కూర్చోగా.. ఆ తర్వాత అపార్ట్‌మెంట్ గేట్ ఆవరణలోకి దూకేసింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు.

కేరళలోని శీతల్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. మహిళ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆమె భర్తతో పాటు కేరళలో ఉన్న ఆమె సోదరుడితో కూడా మాట్లాడారు. శీతల్ గతకొంతకాలంగా డిప్రెషన్‌లో ఉందని, ఇందుకు మందులు కూడా వినియోగిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *