Headlines

Hyderabad: తుక్కుగూడ నర్సు హత్యపై మెజిస్టీరియల్ విచారణ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!


Tukkuguda Nurse Murder Case: తుక్కుగూడలో నర్సును దారుణంగా చంపేశాడో కిరాతకుడు. హాస్పిటల్‌ రూంలో స్నేహితురాలితో కలిసి ఉంటున్న యువతి ప్రాణాలు తీశాడో రాక్షసుడు. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో రూమ్‌‌‌‌లోకి ప్రవేశించిన సనా వుల్లాఖాన్‌ అత్యాచారానికి యత్నించాడు. ప్రతిఘటించడంతో ఇనుప రాడ్‌‌‌‌తో ముఖంపై బాదాడు. బాధితురాలు కేకలు వేయడంతో విషయం బయటకు వస్తుందనే భయంతో గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

నర్సు నివాసం ఉన్న హాస్టల్‌ వద్ద భద్రతా ఏర్పాట్లపై కూడా విచారణ జరపాలని రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రత విషయంలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా? నిబంధనలు పాటించారా? అనే అంశాలను పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసి, వీలైనంత త్వరగా చార్జిషీట్‌ దాఖలు చేయాలని సీఎం ఆదేశించారు. నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందించేందుకు కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *