Headlines

Pakistan Cricket: వైభవ్ లాంటోడు ఒక్కడైనా ఉన్నాడా ? సొంత లీగ్ పై పాక్ మాజీ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు


Pakistan Cricket: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) క్వాలిటీ పై ఆ దేశ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పదేళ్లు పూర్తి చేసుకున్న ఈ లీగ్ నుంచి జాతీయ జట్టుకు సరిపడా టాలెంటెడ్ బ్యాటర్లు ఒక్కరూ రాలేదని ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుత పరిస్థితి, దేశవాళీ టోర్నీల తీరుపై వసీమ్ అక్రమ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభమై పదేళ్లు దాటినప్పటికీ, ఆ లీగ్ నుంచి భారత్ తరహాలో వైభవ్ సూర్యవంశీ లాంటి అద్భుతమైన ఏ ఒక్క క్వాలిటీ బ్యాటర్ అయినా వచ్చారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేవలం కొద్దిమంది క్వాలిటీ బౌలర్లు మాత్రమే లభించారని, అయితే అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించే ఏ ఒక్క గొప్ప బ్యాటింగ్ టాలెంట్‌ను కూడా ఈ లీగ్ అందించలేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనకు అలాంటి అసాధారణ బ్యాటింగ్ టాలెంట్ లభించినప్పుడే జట్టు ప్రదర్శనలో నిజమైన మార్పు కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో బయటపడ్డ లోపాలు

ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు ప్రదర్శిస్తున్న పేలవమైన శైలి చూస్తే ఈ కొరత స్పష్టంగా అర్థమవుతుందని వసీమ్ అక్రమ్ తెలిపారు. ఇంగ్లండ్ బౌలర్ రాబిన్సన్ వేస్తున్న బంతులను ఎదుర్కొనే క్రమంలో బ్యాటర్లు క్రీజులోనే బిగుసుకుపోయి ఆడటాన్ని ఆయన తప్పుపట్టారు. ఫ్రంట్ ఫుట్‌ ముందుకు వేసి ఆడే సాహసం కరవయ్యిందని, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే కేవలం టెక్నిక్ మాత్రమే కాకుండా అపారమైన ధైర్యం కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు.

క్లబ్ క్రికెట్ పునరుద్ధరణే ఏకైక మార్గం

పాకిస్థాన్ క్రికెట్ మళ్లీ పూర్వవైభవం సంతరించుకోవాలంటే అట్టడుగు స్థాయి నుంచి మార్పులు జరగాలని అక్రమ్ సూచించారు. పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాలైన కరాచీ అలాగే లాహోర్ నగరాలలో క్లబ్ క్రికెట్ వ్యవస్థను బతికించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారీగా నిధులు కేటాయించాలని ఆయన కోరారు. కరాచీ, లాహోర్ నగరాల్లో ప్రతి క్లబ్ క్రికెట్ అభివృద్ధికి పీసీబీ కోట్ రూపాయలు ఖర్చు చేయాలని, అసలైన ప్రతిభ అంతా క్లబ్ స్థాయి నుంచే బయటకు వస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు తన పాత వైభవాన్ని కోల్పోవడానికి దేశవాళీ టోర్నీలలోని లోపాలు కారణమని దిగ్గజ ఆటగాడు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికైనా బోర్డు కళ్లు తెరిచి అట్టడుగు స్థాయి నుంచి టాలెంట్‌ను వెలికితీసే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తు మరింత కష్టతరమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *