నటుడు సురేష్ దివంగత నటి సౌందర్యతో తన సుదీర్ఘ అనుబంధం, ఆమె అద్భుతమైన వ్యక్తిత్వం, సినీ ప్రస్థానం గురించి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సురేష్ మాట్లాడుతూ.. సౌందర్యను ఒక హీరోయిన్ ఎలా ఉండాలి అనడానికి సరైన నిర్వచనంగా ఆయన అభివర్ణించారు. ఆమె కట్టుబొట్టు, ప్రవర్తన ఎందరికో ఆదర్శప్రాయమని తెలిపారు. సౌందర్య తొలి సినిమా అమ్మురు అని సురేష్ గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కోసం నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఆమెను బెంగళూరు నుండి ఎంపిక చేశారని వివరించారు. ఆ సమయంలో సౌందర్యకు 16 లేదా 17 సంవత్సరాలు ఉంటాయని, తన వయసు అడగలేదని సురేష్ పేర్కొన్నారు. అమ్మురు చిత్రీకరణ సమయంలో ఆమె చాలా వినయంగా, ఉత్సాహంగా ఉండేవారని, ప్రతి షాట్ తర్వాత సురేష్ గారు కరెక్టేనా సార్, కరెక్టేనా.? అని అడిగేదని సురేష్ గుర్తు చేసుకున్నారు.
సీనియర్ నటుడిగా తనను గౌరవించేదని తెలిపారు. అమ్మురు సినిమా పూర్తయి, ఆ తర్వాత తన తన రెండో సినిమా విడుదలయ్యే సమయానికే సౌందర్య ఎనిమిది సినిమాలు పూర్తిచేసి టాలీవుడ్లో పెద్ద స్టార్ హీరోయిన్గా మారిపోయారని సురేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తను సౌందర్యతో హీరోయిన్గా నటించానని, దొంగాట సినిమాలో ఆమెకు విలన్గా కూడా నటించానని తెలిపారు. వెంకటేష్, సౌందర్య, తను కలిసి కోడి రామకృష్ణ దర్శకత్వంలో దేవి పుత్రుడు సినిమాలో నటించినట్లు పేర్కొన్నారు.
అమ్మురు సినిమా సమయంలో ఎలా ఉందో, దేవి పుత్రుడు చిత్రం వరకు ఆమె ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని సురేష్ ప్రత్యేకంగా ప్రశంసించారు. చాలామంది తమ స్థాయి పెరిగేకొద్దీ, పారితోషికం పెరిగే కొద్దీ ప్రవర్తన మారుతుందని, కానీ సౌందర్యలో ఆ మార్పు ఎక్కడా కనిపించలేదని, ఇది ఒక హీరోయిన్గా చాలా కష్టమైన విషయమని ఆయన అన్నారు. ఆమె ఎప్పుడూ ఒక ఆప్తుడిని, బంధువును పలకరించినట్లే సురేష్ గారు బాగున్నారా అండి, ఇంట్లో అందరూ బాగున్నారా అండి అని ఆప్యాయంగా పలకరించేదని తెలిపారు. ఆమె ఆ వైఖరి తనకు ఎంతో నచ్చిందని సురేష్ చెప్పారు.
సౌందర్యలోని ఆఫ్-స్క్రీన్ నవ్వు తనకు అత్యంత ఇష్టమైన గుణమని సురేష్ వివరించారు. ఆమె నవ్వు పక్కింటి పిల్లలా, పల్లెటూరిలో చూసిన అందమైన అమ్మాయిలా స్వచ్ఛంగా, ముచ్చటగొలిపేలా ఉండేదని వర్ణించారు. ఆమె కళ్లు ఎప్పుడూ జీవంతో, చురుగ్గా డాన్సింగ్ ఐస్లా ఉండేవని తెలిపారు. తను మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లు వేరే వైపు చూస్తుంటే, హలో హలో, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను చూసి మాట్లాడు అని సరదాగా చెప్పేవాడినని గుర్తు చేసుకున్నారు. జీవితం పట్ల ఆమెకు అమితమైన ఉత్సాహం, ప్రేమ ఉండేవని, ఆమె నటనలో కూడా ఆ జీవం, వాస్తవికత కనిపించేవని సురేష్ పేర్కొన్నారు.
అంతటి జీవితం పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి అర్ధాంతరంగా మరణించడం తనను తీవ్రంగా బాధించిందని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో రెండుసార్లు మాత్రమే కన్నీళ్లు పెట్టుకున్నానని, అవి శ్రీహరి, సౌందర్య మరణించినప్పుడు మాత్రమే అని సురేష్ తెలిపారు. శరీరం నశిస్తుందే తప్ప ఆత్మ చావదు, మరో రూపంలో పుడుతుందని తనకో తత్వం ఉందని, అందుకే తన కుటుంబ సభ్యులు మరణించినప్పుడు కూడా తాను అంతగా బాధపడలేదని, కానీ శ్రీహరి, సౌందర్యలను దేవుడు మరీ తొందరగా తీసుకెళ్లడం అన్యాయమని, అది తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన వివరించారు. తాజాగా సౌందర్య భర్త రఘుతో మాట్లాడినప్పుడు, ఆయన పెళ్లి చేసుకుని ఇద్దరు పాపలకు తండ్రి అయ్యారని తెలిసిందని సురేష్ చెప్పారు. సౌందర్య తన కూతుళ్ల రూపంలో తిరిగి పుట్టారని తాను చెప్పగా, రఘు గారు కూడా వారు సౌందర్య పోలికలతో సేమ్ డిట్టో ఉన్నారని చెప్పి సంతోషంగా ఉన్నారని సురేష్ తెలిపారు.




