
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు కూటమి సర్కార్ ప్రతీ ఏడాది రూ.15 వేల ఆర్దిక సాయం అందిస్తోంది. వీటిని నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే 1 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు వీటిని అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది రూ.15 వేలు జమ చేయగా.. ఈ ఏడాదికి సంబంధించిన నిధులు ఎప్పుడు జమ చేస్తామనే దానిపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేశారు.
జూన్లో తల్లికి వందనం
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం నిధులను జూన్లో తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల తర్వాత జూన్లో స్కూల్స్, కాలేజీలు ప్రారంభమవుతాయి. దీంతో విద్యా సంవత్సరం మొదట్లోనే నిధులు రిలీజ్ చేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లులన్నా అందరికీ వర్తింపచేయనున్నారు. ఎలాంటి కొతలు ఉండవని, లబ్దిదారులందరికీ అందుతాయని స్పష్టం చేశారు. ఇక విద్యార్థులకు తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకుడి అకౌంట్లో వీటిని జమ చేస్తారు. అయితే తల్లికి వందనం నిధులు జమ కావాలంటే.. విద్యార్థికి 75 శాతం అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. విద్యార్థి తల్లికి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అయితే విద్యార్థుల నిర్వహణ ఖర్చుల కోసం రూ.2 వేలు కట్ చేసి రూ.13 వేలు అకౌంట్ల జమ అవుతాయి. విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు భారం కూకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో ఈ స్కీమ్ అమలు చేసింది.
ప్రతీ ఇంటికి పైప్ లైన్ గ్యాస్
ఇక రాబోయే రోజుల్లో ప్రతీ ఇంటికి పైప్డ్ నేచురల్ గ్యాస్ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీని వల్ల రానున్న కాలంలో గ్యాస్ కొరత ఉండదన్నారు. ఇక పైప్ లైన్ గ్యాస్ తీసుకున్నవారికి ప్రతీ ఏడాది రూ.2,400 సబ్సిడీగా అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోని చేనేతలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తున్నామని, ఇది సూపర్ హిట్ అయిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులు పేదల సేవలోనే ఉంటున్నారన్నారు.