ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే కీలక మార్గం హార్ముజ్ జలసంధి ఇప్పుడు రణరంగంగా మారింది. భారత జెండాతో ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది. ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేయడంతో పాటు సముద్ర మార్గంలో భారత నౌకల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బలగాలు ఒమన్ తీరానికి సమీపంలో భారత ముడి చమురు ట్యాంకర్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ అందించిన సమాచారం ప్రకారం.. ఒమన్ తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా, ఐఆర్జీసీ గన్బోట్లు ఒక్కసారిగా మెషీన్ గన్లతో విరుచుకుపడ్డాయి. ఒక భారీ ఆయిల్ ట్యాంకర్తో పాటు, మరో కంటైనర్ షిప్పై కూడా ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ దాడుల నేపథ్యంలో సన్మార్ హెరాల్డ్, జాగ్ ఆర్నావ్ సహా సుమారు 13 భారత నౌకలు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని హార్ముజ్ జలసంధి నుంచి వెనుదిరిగాయి.
భారత్ సీరియస్.. ఇరాన్ రాయబారికి సమన్లు
భారత నౌకలపై దాడి జరిగిన వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ యాక్షన్ మొదలుపెట్టింది. ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని కార్యాలయానికి పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో భారత జెండా ఉన్న నౌకలపై ఇలాంటి దాడులు సహించబోమని స్పష్టం చేసింది. అయితే అమెరికా తమపై విధిస్తున్న ఆంక్షలకు నిరసనగా హార్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించామని, ఆంక్షలు తొలగించే వరకు వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ అల్టిమేటం ఇవ్వడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
హైదరాబాద్లో ఇరాన్ ప్రతినిధి రియాక్షన్
మరోవైపు హైదరాబాద్లో ఇరానీ ముస్లింలతో సమావేశమైన ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ ఈ ఘటనపై స్పందించారు. భారత నౌకలపై కాల్పుల ఘటన దురదృష్టకరమని, ఈ సమస్య త్వరలోనే సామరస్యపూర్వకంగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ చమురు రవాణాలో 20శాతం వాటా ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగితే భారత మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి.