కాళేశ్వరం ఆలయ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందుకోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఆలయ అభివృద్ధితో పాటు ఇతర పనులకు శ్రీకారం చుట్టింది. భక్తులకు కనీస వసతులు కల్పించడం, ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడం వంటి అంశాలపై సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం చేరుకున్న సీఎంకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రేవంత్ రెడ్డి. శ్రీ శుభానంద అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తరువాత ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి నిర్మాణ పనులను ప్రారంభించారు. సిమెంట్తో నిర్మించిన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ప్రధాన గర్భాలయం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాలు తొలగించి రాతితో నిర్మాణాలు చేపట్టనున్నారు. గోదావరి ఒడ్డున ఉన్న ఈ చారిత్రాత్మక ఆలయంలో దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు, కొత్త పరిపాలనా భవనం, విశాలమైన క్యూ కాంప్లెక్స్, మెరుగైన సౌకర్యాలతో సహా యాత్రికుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచేలా పనులు చేపట్టనున్నారు.
ఇక రూ.3.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న కాళేశ్వరం బస్టాండ్ పనులకు సైతం సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. భక్తులకు కనీస వసతులు కల్పించడం, ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడం వంటి అంశాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..