జనసేన పార్టీకి దేశ సమగ్రత, జాతీయ సమైక్యతే అత్యున్నత ప్రాధాన్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. “దేశమే ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్” అనేది ఇకపై జనసేన పార్టీ విధానం మాత్రమే కాకుండా అధికారిక నినాదంగా కూడా కొనసాగుతుందని ప్రకటించారు. దేశ విభజన భావజాలం, ప్రాంతీయ విద్వేషాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టే శక్తులపై జనసేన రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని అశోక హోటల్లో నిర్వహించిన “జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం” సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
2014లో జనసేన పార్టీని స్థాపించినప్పుడు అధికారం లేదా పదవుల కోసం కాదని, దేశ ప్రయోజనాలు, జాతీయ సమైక్యత కోసం పార్టీని ప్రారంభించామని పవన్ గుర్తు చేశారు. దేశాన్ని బలోపేతం చేయడం, ప్రజల్లో జాతీయ చైతన్యం పెంపొందించడం, సమగ్రతను కాపాడటం పార్టీ ప్రధాన లక్ష్యాలని చెప్పారు. 12 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, పరాజయాలు ఎదురైనా, నేడు లక్షలాది మంది కార్యకర్తలతో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగామని పేర్కొన్నారు.
దేశ సమైక్యత కోసం ఢిల్లీ వేదికను ఎంచుకోవడంపై కూడా పవన్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఢిల్లీ భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థకు, త్యాగాలకు ప్రతీక అని పేర్కొన్నారు. దేశాన్ని ఏకం చేయడంలో తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ పాత్రను గుర్తు చేస్తూ, దేశ సమగ్రతను కాపాడటం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని అన్నారు. అదే ఆలోచనతో జనసేన ముందుకు సాగుతోందని చెప్పారు.
తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనను నిర్వహించిన తీరును మాత్రమే విమర్శించామని స్పష్టం చేశారు. సరైన విధానంలో విభజన జరగకపోవడం వల్లే ఇప్పటికీ ఆస్తుల పంపకం, విభజన సమస్యలు కొనసాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే శక్తులను జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని పవన్ హెచ్చరించారు. దేశ సమగ్రతకు హాని చేసే చర్యలు, విభజనవాద రాజకీయాలను బలంగా ఎదుర్కొంటామని తెలిపారు. అధికార రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
అలాగే జనసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ, రాజ్యసభ సభ్యులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. కేవలం తమ నియోజకవర్గాల సమస్యలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ అంశాలపై పార్లమెంట్లో గళమెత్తాలని సూచించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ సమగ్రత, రాజ్యాంగ విలువలు, జాతీయ ప్రయోజనాల కోసం జనసేన ఎంపీలు పోరాడాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు దేశభక్తి, రాజ్యాంగ విలువలు, బాధ్యతాయుత రాజకీయాలపై అవగాహన కల్పించడం కూడా జనసేన లక్ష్యమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దేశం బలపడితేనే రాష్ట్రాలు బలపడతాయని, అందుకే దేశమే తమ తొలి ప్రాధాన్యమని మరోసారి స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…