
బ్రిటన్ రాజకీయ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. ప్రముఖ క్రిప్టోకరెన్సీ ప్లాట్ఫామ్ బిట్మెక్స్ కో-ఫౌండర్, క్రిప్టో బిలియనీర్ బెన్ డెలో బ్రిటన్కు చెందిన నైజెల్ ఫరాజ్ నడుపుతున్న రిఫార్మ్ యూకే పార్టీకి ఏకంగా 36 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.465 కోట్లు) భారీ విరాళంగా ఇచ్చారు. బ్రిటన్ చరిత్రలో ఒక రాజకీయ పార్టీకి అందిన అతిపెద్ద విరాళం ఇదే.
రికార్డు విరాళానికి కారణం ఇదే:
డైలీ టెలిగ్రాఫ్లో రాసిన కథనంలో డెలో ఈ చందా వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. బ్రిటన్లో దశాబ్దాలుగా ఏలుతున్న లేబర్, కన్జర్వేటివ్ వంటి సాంప్రదాయ పెద్ద పార్టీలకు నిధుల కొరత ఉండదని, కానీ ప్రత్యామ్నాయంగా ఉద్భవిస్తున్న రిఫార్మ్ యూకేకి సరైన ఆర్థిక మద్దతు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2029లో జరగనున్న తదుపరి సార్వత్రిక ఎన్నికల వరకు ప్రతి నెలా 1 మిలియన్ పౌండ్లు ఇచ్చేందుకు బదులుగా, ఎన్నికల సన్నాహాల కోసం ఈ నిధులను ఒకేసారి అడ్వాన్స్గా అందించినట్లు డెలో పేర్కొన్నారు. పోటీ సమానంగా, న్యాయబద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సహాయం చేశాను అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎవరీ బెన్ డెలో?
ఆక్స్ఫర్డ్ గ్రాడ్యుయేట్ అయిన బెన్ డెలో బిట్మెక్స్ ద్వారా క్రిప్టో ప్రపంచంలో బిలియనీర్గా ఎదిగారు. 2022లో అమెరికా బ్యాంకింగ్ నిబంధనల ఉల్లంఘన కేసులో జరిమానా ఎదుర్కొన్న ఆయనకు, 2025లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. ప్రస్తుతం హాంకాంగ్లో ఉంటున్న ఆయన, బ్రిటన్ విదేశీ చందాలపై కొత్త ఆంక్షలు తీసుకురాకముందే తిరిగి స్వదేశానికి చేరుకునే ప్లాన్లో ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో కూడా ఆయన ఈ పార్టీకి రూ.51 కోట్లకు పైగా చందా ఇచ్చారు.
వివాదాల నడుమ దక్కిన ఊరట:
ఇటీవలి కాలంలో రిఫార్మ్ యూకే పార్టీ విదేశీ విరాళాల వివాదాలు, పోలీస్ తనిఖీల ఆరోపణలు ఎదుర్కొంటోంది. పార్టీ అధినేత నైజెల్ ఫరాజ్ కూడా కొన్ని నిధుల విషయంలో విచారణను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కష్టకాలంలో బెన్ డెలో ఇచ్చిన రూ.465 కోట్ల నిధులు పార్టీకి కొత్త ఊపిరి పోశాయని నైజెల్ ఫరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బ్రిటన్ ప్రధాన రాజకీయ శక్తులకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని రిఫార్మ్ యూకే భావిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..