తింటే ప్రాణాలకే ముప్పు..! చార్మినార్ ఫాస్ట్ ఫుడ్ గోదాములో బయటపడ్డ షాకింగ్ బండారం!

తింటే ప్రాణాలకే ముప్పు..! చార్మినార్ ఫాస్ట్ ఫుడ్ గోదాములో బయటపడ్డ షాకింగ్ బండారం!


హైదరాబాద్ మహానగరంలో గత రెండు రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీలు కల్తీ ఆహార వ్యాపారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న నాణ్యతలేని, అపరిశుభ్ర ఆహార తయారీ కేంద్రాలపై అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా చార్మినార్ పరిధిలోని హుస్సేనీఆలం ప్రాంతంలో ఉన్న ‘అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్’ గోదాముపై హెచ్-ఫాస్ట్ (Hyderabad Food Safety Task Force) బృందం ఆకస్మికంగా దాడులు చేపట్టింది. తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్ లేకుండానే గోదామును నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాల తయారీలో నిషేధిత కృత్రిమ రంగులను వినియోగిస్తున్నట్లు బయటపడింది. అలాగే ఒకసారి ఉపయోగించిన వంట నూనెను పదేపదే వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నట్లు తేలింది.

అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వంట నూనెతో పాటు కృత్రిమ రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇటీవలి రెండు రోజులుగా నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార గోదాములపై నిర్వహించిన తనిఖీల్లో నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలు బయటపడిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, ఆహార కల్తీపై జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తామని హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద ఆహార పదార్థాలు, కల్తీ ఆహారంపై ఫిర్యాదులు ఉన్నవారు 8712661212 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *