వర్షాకాలం మొదలయ్యాక ఫస్ట్ టైం ఏపీ, తెలంగాణలో ఒకేరోజు భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కూడా భారీవర్షం కురుస్తోంది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ ప్రజలు ఉరుముల సౌండ్ విన్నారు. మొత్తానికి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుధవారం ఏపీ, తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
బుధవారం (29-07-2026) అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కృష్ణా, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.




