Andhra Pradesh: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో మరో కీలక పరిణామం

Andhra Pradesh: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో మరో కీలక పరిణామం


అమరావతి: విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంలో సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సచివాలయంలో సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి వచ్చిన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చారు. దీనిపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు చేయాలని సీఎం స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని.. దీనిపై డీజీపీ సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనలు చేశారు. ఈ సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తదితరులు హాజరయ్యారు.

సీసీ ఫుటేజ్‌ భద్రపర్చాలి.. విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో కీలక పరిణామం

కాగా.. తన కొడుకుని పోలీసులే కొట్టిచంపేశారంటోంది సాయికృష్ణ తల్లి. ఒకవేళ బతికి ఉంటే చూపించాలని.. లేదంటే మృతదేహాన్ని అయినా ఇప్పించాలని వేడుకుంటోంది. ఈ క్రమంలో విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక PS సీసీ ఫుటేజ్‌ భద్రపర్చాలని సాయికృష్ణ తల్లి పిటిషన్‌ వేశారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ సీసీ ఫుటేజ్‌తోపాటు కాల్‌డేటా భద్రపర్చాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈరోజు విజయవాడ రెండో AJM కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. సీఐ నాగరాజు తన ఫోన్‌ తీసుకుని కాల్స్‌ చేశారన్న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి..పీఎస్‌కి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారని పిటిషన్‌ లో పేర్కొన్నారు. నిజాలు బయటికి రావాలంటే ఆధారాలను కాపాడాలంటూ సాయికృష్ణ తల్లి కోరారు.

విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో దర్యాప్తు షురూ

రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నేతృత్వంలో విచారణ జరగనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఐపీఎస్‌ అధికారితో దర్యాప్తు చేస్తున్నారు. విచారణ నిమిత్తం ఇవాళ కృష్ణలంక పీఎస్‌కి రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ రానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *