నేడు జనగణన అంటే కంప్యూటర్లు, డిజిటల్ డేటా, ఆన్లైన్ సర్వేలు గుర్తుకు వస్తాయి. కానీ, 125 ఏళ్ల క్రితమే హైదరాబాద్ సంస్థానంలో జనాభా లెక్కల కోసం వినూత్న పద్ధతిని అమలు చేశారంటే ఆశ్చర్యమే. 1901 జనగణన సందర్భంగా హైదరాబాద్లో అధికారులు రంగురంగుల కాగితపు చీటీలను, ప్రత్యేక గుర్తులను ఉపయోగించి ప్రజల వివరాలను సేకరించారు. అప్పటి పరిస్థితుల్లో ఇది అత్యంత ఆధునికమైన, సమర్థవంతమైన విధానంగా గుర్తింపు పొందింది.
1901లో నిర్వహించిన జనగణన హైదరాబాద్లో జరిగిన రెండో అధికారిక లెక్కల సేకరణ. 1891 జనగణనలో ఉపయోగించిన పాత ట్యాలీ మార్క్ విధానం సమయం ఎక్కువ తీసుకోవడంతో పాటు క్లిష్టంగా ఉండేదని అధికారులు భావించారు. దీంతో కొత్తగా రంగుల చీటీల విధానాన్ని ప్రవేశపెట్టారు. మతాల ఆధారంగా వేర్వేరు రంగుల చీటీలను కేటాయించారు. హిందువులకు గోధుమరంగు (బ్రౌన్), ముస్లింలకు ఆకుపచ్చ, క్రైస్తవులకు గులాబీ రంగు చీటీలు ఇచ్చారు. జైనులకు నీలం రంగు, ఇతర మతాల వారికి తెలుపు రంగు చీటీలు కేటాయించారు.
కేవలం మతం మాత్రమే కాకుండా వ్యక్తుల లింగం, వైవాహిక స్థితిని కూడా ప్రత్యేక గుర్తుల ద్వారా నమోదు చేశారు. పురుషులు, మహిళలు, అవివాహితులు, వివాహితులు, వితంతువులకు వేర్వేరు గుర్తులను ఉపయోగించి సమాచారం సేకరించారు. దీంతో జనాభా గణాంకాలను వర్గీకరించడం సులభమైంది. చీటీల సేకరణ పూర్తయిన తర్వాత వాటిని వేరు చేసి లెక్కించడం ద్వారా ఖచ్చితమైన సమాచారం సిద్ధం చేశారు.
ఇవి కూడా చదవండి
చరిత్రకారుల వివరాల ప్రకారం ఈ విధానం జర్మనీలోని బవేరియన్ జనగణన నమూనా నుంచి ప్రేరణ పొందింది. అయితే హైదరాబాద్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి అమలు చేశారు. అప్పటి జనగణన కమిషనర్ మీర్జా మెహ్దీ ఖాన్ తన నివేదికలో ఈ విధానం వల్ల సమయం, ఖర్చు తగ్గడమే కాకుండా గణాంకాల ఖచ్చితత్వం కూడా పెరిగిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం డిజిటల్ యుగంలో జనగణన జరుగుతున్నప్పటికీ, 1901లోనే హైదరాబాద్లో అమలు చేసిన ఈ రంగుల చీటీల విధానం అప్పటి పాలనా వ్యవస్థ దూరదృష్టికి నిదర్శనంగా నిలిచింది. సాంకేతిక సదుపాయాలు లేని కాలంలోనే వినూత్న పద్ధతులతో జనాభా లెక్కలు సేకరించడం హైదరాబాద్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..