ఆంధ్రప్రదేశ్ విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు సంచలనంగా మారింది. ప్రభుత్వం ఆదేశాలతో సాయికృష్ణ అదృశ్యంపై ముమ్మరంగా విచారణ కొనసాగుతోంది.. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవిప్రకాష్ ను నియమించింది. అయితే, నాగరాజును నేడు అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో సింగ్నగర్లోని నాగరాజు నివాసానికి ఆయన మద్దతుదారులు భారీగా చేరుకున్నారు. నాగరాజుకు మద్దతుగా మద్దతుదారుల నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నాగరాజు లొంగిపోతారా లేక అరెస్ట్ చేస్తారా అనే ఆంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది..
ఇదిలాఉంటే.. నిన్న అర్ధరాత్రి వరకు కృష్ణలంక పోలీస్టేషన్లో స్టేషన్ సిబ్బందితో పాటు, టాస్క్ ఫోర్స్ పోలీసులను విచారించింది ఏసీపీ దైవ ప్రసాద్ బృందం.. సాయికృష్ణను లాకప్ డెత్ చేసి దహనం చేశారన్న ఆరోపణలుతో ఇప్పటికే కృష్ణలంక స్వర్గపురిలో వివరాలు సేకరించారు పటమట సిఐ పవన్ కిషోర్.. మే 23 నుంచి 25 వరకు 3 రోజుల పాటు అనాధ మృతదేహాలు తెచ్చారన్న సమాచారంతో రాత్రి బస్టాండు నుంచి స్వర్గపురి వరకు సీసీ కెమెరాలను గుణదల సి.ఐ పరిశీలించారు.
మరోవైపు ఇదే కేసులో క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాల విచారణ ఆధారంగా ఏసీపీ దైవ ప్రసాద్ బృందం సాక్ష్యాలు సేకరిస్తోంది. ఇప్పటికే సిఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు వేసిన ఉన్నతాధికారులు, ఈ కేసులో నాగరాజుతోపాటు ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై ఆరా తీస్తున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ లతా కుమారిని నిన్న మరోసారి విచారణకు పిలిచి స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు.
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కమిషనరేట్ పరిధిలో ఉన్న జగ్గయ్యపేట, మైలవరం, గుణదల, వన్టౌన్, సత్యనారాయణ పురం, పటమట సి.ఐ లతో కీలక ఆధారాల కోసం సిపి రాజశేఖర్ బాబు దర్యాప్తు చేయిస్తున్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పిన అంశాల ఆధారంగా ఆయా ప్రాంతాల పరిధిలో విచారణ కొనసాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..