మనసును కదిలించే బంధం: 400 కోతులకు అమ్మగా మారిన 76 ఏళ్ల మాజీ పోలీస్ ఆఫీసర్!

మనసును కదిలించే బంధం: 400 కోతులకు అమ్మగా మారిన 76 ఏళ్ల మాజీ పోలీస్ ఆఫీసర్!


రిటైర్మెంట్ తర్వాత చాలా మంది ప్రశాంతంగా, విశ్రాంతిగా సుఖవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కానీ, తమిళనాడులోని మదురైకి చెందిన 76 ఏళ్ల మాలతి మాత్రం సమాజానికి, మూగజీవాలకు ఉపయోగపడే ఒక విలక్షణమైన సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. గత 10 సంవత్సరాలుగా ప్రతి వారం వందలాది కోతులకు స్వయంగా ఆహారం అందిస్తూ ఆమె వార్తల్లో నిలిచారు. ఈ మాజీ పోలీస్ అధికారిణికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

మాలతి తమిళనాడు పోలీసు శాఖలో సుదీర్ఘంగా 33 సంవత్సరాల పాటు సేవలందించి, 2010లో పదవీ విరమణ చేశారు. అంతేకాకుండా ఆమె విద్యా రంగంలో కూడా కొంతకాలం పాటు పనిచేశారు. ఉద్యోగ బాధ్యతల నుండి తప్పుకున్న తర్వాత, ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక ఆమె జంతు సంక్షేమంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే 2015 నుండి స్థానికంగా ఉండే కోతులకు ప్రతి వారం ఆహారం పెట్టడాన్ని ఒక యజ్ఞంలా ప్రారంభించారు.

ప్రతి శనివారం మధ్యాహ్నం అయ్యిందంటే చాలు.. మాలతి తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుప్పరన్‌కుండ్రం పరిసరాల్లోని ఆరు వేర్వేరు ప్రాంతాలను సందర్శిస్తారు. వీటిలో మురుగన్ ఆలయ సముదాయం, శరవణ పొయిగై, పాల్చునైకంద సుబ్రహ్మణ్య ఆలయం, మయిల్ తొప్పు (నెమళ్ల తోట), గుహాలయం ప్రాంతం, చారిత్రక కోట ప్రాంతం ఉన్నాయి. ఆమె కోతులను పిలవగానే, వందలాది కోతులు ఆమె వద్దకు గుంపుగా వస్తాయి. ఈ ప్రాంతాలలో సుమారు 350 నుండి 400 కోతులు నివసిస్తున్నాయని, అవి ఆమె గొంతును గుర్తిస్తాయని మాట్లాడుతూ చెప్పింది.

ఆమె ఆయా ప్రాంతాలకు చేరుకుని ప్రేమగా పిలవగానే, వందలాది కోతులు చెట్లపై నుండి, కొండలపై నుండి గుంపులు గుంపులుగా ఆమె వద్దకు పరుగెత్తుకు వస్తాయి. గడిచిన పదేళ్లుగా నిరంతరాయంగా చూపిస్తున్న సంరక్షణ వల్ల, మాలతికి ఆ కోతులకు మధ్య ఒక విడదీయరాని ప్రత్యేక బంధం ఏర్పడింది. సాధారణంగా మనుషులను చూస్తే భయపడే లేదా దాడి చేసే కోతులు, ఆమె దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎంతో సాధువులుగా మారిపోతాయి. ఎలాంటి భయం లేకుండా ఆమె చేతుల మీదుగా ఆహారాన్ని అందుకుంటాయి. “ఈ ప్రాంతాలలో సుమారు 350 నుండి 400 కోతులు నివసిస్తున్నాయి. నేను పిలిచే పిలుపును, నా గొంతును అవి స్పష్టంగా గుర్తిస్తాయి” అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం 76 ఏళ్ల వయస్సు పైబడటం, కొన్ని వృద్ధాప్య ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నప్పటికీ, మాలతి మాత్రం తన వారాంతపు సేవను ఎక్కడా ఆపడం లేదు. ఈ మూగజీవాలకు సేవ చేయడం వల్ల తనకు ఎనలేని మనశ్శాంతి, ఆత్మసంతృప్తి లభిస్తున్నాయని ఆమె చెబుతున్నారు. ఆ కోతులు తనపై చూపే నిష్కల్మషమైన ప్రేమే తన జీవితంలోని నిజమైన సంపద అని నమ్మే మాలతి, తన ఆరోగ్యం సహకరించినంత కాలం ఈ సేవను ఇలాగే కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *