వీకెండ్ వచ్చిందంటే చాలు.. నాన్వెజ్ లవర్స్ ఇళ్లల్లో మటన్ లేదా చికెన్ లాంటివి ఉండాల్సిందే.. ముఖ్యంగా చాలామంది ఖర్చు ఎక్కువైనా సరే.. మటన్ ను ఎక్కువగా తెచ్చుకుంటారు.. అయితే.. సాహారులకు మటన్ బిర్యానీ లేదా మటన్ కర్రీ పేరు వింటేనే నోరూరుతుంది. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన మటన్ లేతది కాకుండా ముదురుది అయితే ఉడికించడం పెద్ద సవాలుగా మారుతుంది. ప్రెజర్ కుక్కర్లో వేసినా 7-8 సార్లు విజిల్ వచ్చినా ముక్క మెత్తబడదు. మటన్ వండేటప్పుడూ తరచూ ఎదురయ్యే ప్రధాన సమస్య సరిగా ఉడకకపోవడం.. అలాంటప్పుడు కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను పాటిస్తే ముదురు మటన్ సైతం త్వరగా, మెత్తగా ఉడుకుతుంది.
వంట నిపుణులు సూచించే కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలు పాటిస్తే ముదురు మటన్ కూడా క్షణాల్లో మెత్తగా ఉడుకుతుంది. వండే అర గంట ముందు పచ్చి బొప్పాయి పేస్ట్ లేదా పెరుగుతో మ్యారినేట్ చేయడం ద్వారా సమయం, గ్యాస్ ఆదా అవ్వడమే కాకుండా నోరూరించే రుచికరమైన మటన్ కర్రీని ఆస్వాదించవచ్చు.
ముదురు మాంసాన్ని మెత్తగా మార్చడంలో పచ్చి బొప్పాయి దిట్ట.
పచ్చి బొప్పాయి తొక్కతో సహా పేస్ట్ చేసి, మటన్ ముక్కలకు పట్టించి (మారినేషన్) కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. బొప్పాయిలో ఉండే ‘పాపైన్’ (Papain) అనే ఎంజైమ్ మాంసంలోని ప్రోటీన్ నారలను త్వరగా విడగొట్టి ముక్కను ఎంతో మెత్తగా మారుస్తుంది.
పెరుగు లేదా నిమ్మరసం:
ఆమ్ల గుణాలు, కలిగిన పదార్థాలు మాంసాన్ని త్వరగా ఉడికిస్తాయి. మటన్ను వండే ముందు పెరుగు, నిమ్మరసం లేదా కొద్దిగా వెనిగర్ వేసి బాగా కలిపి ఒక అర్ధగంట పాటు మ్యారినేట్ చేయాలి. వీటిలోని ఆమ్లత మాంసం త్వరగా మెత్తబడటానికి సహాయపడుతుంది, కర్రీకి మంచి రుచిని ఇస్తుంది.
తమలపాకు లేదా కొబ్బరి చిప్ప ముక్క
ఇది చాలాకాలంగా మన ఇళ్లలో పాటిస్తున్న సాంప్రదాయ చిట్కా.
మటన్ ఉడుకుతున్న పాత్రలో లేదా కుక్కర్లో ఒక తమలపాకును కానీ, లేదా చిన్న పచ్చి కొబ్బరి చిప్ప ముక్కను కానీ వేసి ఉడికించాలి. వీటిలోని కొన్ని సహజ గుణాలు మాంసాన్ని త్వరగా ఉడికేలా చేస్తాయి. వంట పూర్తయ్యాక ఆ ముక్కను తీసివేస్తే సరిపోతుంది.
ఇంకా.. మాంసం ఉడికించేటప్పుడు ఉప్పు, కారం వేసే సమయం చాలా ముఖ్యం.
మటన్ వండేటప్పుడు మొదట్లోనే ఎక్కువ కారం, ఉప్పు వేయకూడదు. మటన్ 70-80% ఉడికిన తర్వాత మాత్రమే మసాలాలు, కారం, ఉప్పు చేర్చాలి. ముందే ఉప్పు/కారం వేస్తే మాంసం నీటిని కోల్పోయి గట్టిపడుతుంది.
మటన్ కర్రీ వండే విధానం..
ముందుగా మటన్ ముక్కలను నీటితో శుభ్రంగా కడిగి పచ్చి బొప్పాయితో మారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత.. కుక్కర్లో నూనె వేయించి, మసాలా దినుసులు (లవంగాలు, ఇలాచి, చెక్క) వేసి వేయించాలి. అనంతరం తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి. ఇప్పుడు మటన్, పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం కారం, ధనియాల పొడి వేసి మటన్ కు పట్టేలా కొన్ని నిమిషాలు మగ్గించాలి. కావాలంటే.. టమోటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు ఉడికించాలి. తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి, 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి, గరం మసాలా, కొత్తిమీర చల్లుకొని దించాలి.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..