
మామిడి ప్రియులారా జాగ్రత్త! నోరూరించే ఆ పండును చూసి టెమ్ట్ అయ్యారో.. మీ అనారోగ్యాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టే! ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న మామిడి పండ్లు సహజంగా పండినవేనా? లేక రసాయనాలతో మగ్గించినవా? అని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మామిడి పండు సీజన్ మొదలైందో లేదో.. అప్పుడే అక్రమార్కులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో కృత్రిమంగా మామిడి పళ్ళను మగ్గిస్తున్న ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మద్ ఫ్రూట్ సెంటర్ గోదాం నుంచే నగరంలోని వివిధ ప్రాంతాలకు మామిడి పండ్లు సరఫరా అవుతుంటాయి. అయితే, సహజంగా పండాల్సిన పండ్లను రసాయనాలతో మగ్గిస్తున్నారన్న పక్కా సమాచారంతో చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
మామిడి పండ్లను త్వరగా మగ్గించడం కోసం ‘ఇథలీన్’ అనే ప్రమాదకరమైన రసాయనాన్ని ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రంగు కోసం, త్వరగా పండటం కోసం వాడుతున్న ఈ రసాయన పండ్లు.. తింటే ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా గోదాంలో నిల్వ ఉంచిన 140 ట్రేల మామిడి పండ్లతో పాటు, రెండు కార్టన్ల ఇథలీన్ ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్రమంగా మార్కెట్లోకి తరలించి విక్రయించేందుకు యజమాని పథకం వేశాడని విచారణలో తేలింది. ఈ ఘటనపై అహ్మద్ ఫ్రూట్ సెంటర్ యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గోదాంను సీజ్ చేశారు. పండ్లు కొనేటప్పుడు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..