Headlines

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ చెల్లించకపోతే బ్యాంకులు రైతుల భూమిని జప్తు చేయవచ్చా..? నిబంధనలు ఇవే..


కేంద్ర ప్రభుత్వం రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా రుణ సౌకర్యం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి హామీ పెట్టాల్సిన అవసరం లేకుండా బ్యాంకుల ద్వారా రుణం అందిస్తోంది. రైతులు తమ పంట పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ వసూలు చేస్తుంటారు. దీంతో రైతుల పంటలకు పెట్టుబడి కోసం కేంద్రం రూ.5 లక్షల వరకు లోన్ అందిస్తోంది. అంతేకాకుండా కేసీసీ లోన్ వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సకాలంలో తిరిగి చెల్లిస్తే వడ్డీ రాయితీ సౌకర్యం కూడా కేంద్రం కల్పిస్తోంది. ఒకసారి లోన్ మంజూరైన తర్వాత ఎప్పుడైనా నగదు తీసుకోవచ్చు.

వ్యవసాయ రుణాలు రైతులకు సులభతరంగా అందేలా చేసేందుకు కేంద్రం 1998లో పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. వడ్డీ వ్యాపారుల బారి నుంచి రైతులను తప్పించేందుకు కేంద్రం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. రైతులు తమ వ్యవసాయ పనుల కోసం ఈ లోన్ తీసుకోవచ్చు. పట్టాదారు పాస్ బుక్, ఆధార్ లాంటి డాక్యుమెంట్స్ సమర్పిస్తే సరిపోతుంది. డాక్యుమెంట్స్ ప్రాసెస్ కూడా పెద్దగా ఉండదు. గతంలో రుణ పరిమితి రూ.3 లక్షలుగా ఉండగా… ఇప్పుడు రూ.5 లక్షల వరకు కేంద్రం పెంచింది. దీంతో అర్హత గల రైతులు రూ.5 లక్షల రుణం తక్కువ వడ్డీకే పొందవచ్చు. ఈ రుణానికి ఎలాంటి పూచీకత్తు కూడా సమర్పించాల్సిన అవసరం ఉండదు. పూచీకత్తు లేకుండా రూ.2 లక్షల వరకు తీసుకోవచ్చు. రుణం తీసుకున్న ఏడాదిలోగా చెల్లిస్తే వడ్డీపై రాయితీ కల్పిస్తారు.

చెల్లించకపోతే పోలం జప్తు చేస్తారా..?

ఒకవేళ కేసీసీ రుణం చెల్లించకపోతే ఆస్తులు లేదా భూమిని బ్యాంక్ జప్తు చేస్తుందా? అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. సకాలంలో చెల్లించకపోతే బ్యాంక్ వసూలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. అయితే రైతుల భూమిని వెంటనే వేలం వేయరు. ముందుగా రికవరీ విధానాలను పాటిస్తారు. అప్పటికీ వసూలు కాకపోతే పరిపాలనా అనుమతుల అనంతరం భూమి జప్తు చేసే అవకాశం ఉంటుంది. కోర్టు నోటీసుల ద్వారా జప్తు చేసే హక్కు ఉంటుంది. అయితే రుణ చెల్లింపు నోటీసులు, దీర్ఘకాలిక రుణ ఎగవేతలను రైతులు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. వీటిని స్వీకరించి సరైన సమాధానం ఇవ్వాలి. అగ్రాలో కేసీసీ రుణం తీసుకుని చెల్లించని తొమ్మిది మంది రుణగ్రహీతల ఆస్తులను బ్యాంక్ జప్తు చేసింది. దీంతో కేసీసీ రుణం చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేసే అధికారం బ్యాంకులకు ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *