పురావస్తు పరిశోధనలు ఎప్పుడూ చరిత్రకు సంబంధించిన విస్తుపోయే నిజాలను, రహస్యాలను మన ముందుకు తెస్తుంటాయి. తాజాగా మధ్య జర్మనీలోని గెర్స్టెవిట్జ్ (Gerstewitz) గ్రామం సమీపంలో జరిగిన ఒక తవ్వకంలో దాదాపు 5,000 సంవత్సరాల నాటి మానవ అస్థిపంజరం లభ్యమైంది. ఇది చూసిన శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. జర్మనీలో నిర్మిస్తున్న ‘SuedOstLink’ అనే హై-వోల్టేజ్ విద్యుత్ లైన్ కోసం భూమిని తవ్వుతుండగా ఈ ప్రాచీన అస్థిపంజరం వెలుగుచూసింది.
భట్టీ గుంతలో పూడ్చిపెట్టిన శవం:
పరిశోధకుల వివరాల ప్రకారం.. ఈ అస్థిపంజరం కార్డెడ్ వేర్ సంస్కృతి (Corded Ware Culture) కాలానికి చెందిన ఒక యువకుడిది. మరణించే సమయానికి అతని వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉండవచ్చు. అయితే, ఈ ఆవిష్కరణలో అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే అతడిని దహనం చేసిన లేదా పూడ్చిన స్థలం. సాధారణంగా ఈ సంస్కృతిలో మరణించిన వారిని ఒక నిర్దిష్ట దిశలో (దక్షిణం వైపు ముఖం ఉండేలా) వంచి సమాధి చేసేవారు. కానీ ఈ యువకుడి శవాన్ని ఒక పురాతన భట్టీ గుంత (Kiln) లో పూడ్చిపెట్టారు. పూర్వ కాలంలో ఈ భట్టీలను ఆహారం వండటానికి లేదా మట్టి పాత్రలను కాల్చడానికి ఉపయోగించేవారు. ఇలాంటి చోట శవం దొరకడం చరిత్రలోనే అత్యంత అరుదు.
నరబలి కోణంలో దర్యాప్తు:
ఆ యువకుడి పుర్రెను పరిశీలించిన నిపుణులు, తలపై బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా శాస్త్రవేత్తలు మూడు ప్రధాన అవకాశాలను వ్యక్తపరుస్తున్నారు. ఆ కాలంలో జరిగిన ఏదైనా ఘర్షణలో అతడిని హత్య చేసి, శవాన్ని దాచడానికి భట్టీ గుంతలో పడేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. చరిత్రలో నమోదు కాని ఏదైనా తెగల యుద్ధంలో అతను మరణించి ఉండవచ్చు, దాంతో తోటివారు అత్యవసరంగా అక్కడ పూడ్చిపెట్టారు అని కూడా అంచాన వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నరబలి (Human Sacrifice): అన్నింటికంటే బలమైన అనుమానం నరబలిదే. ఈ సంస్కృతికి చెందిన భట్టీ గుంతల్లో గతంలోనూ దేవతలను సంతృప్తి పరచడానికి బలి ఇచ్చిన పశువులు, కుక్కల అస్థిపంజరాలు లభించాయి. ఇప్పుడు మనుషుల పుర్రెపై ఉన్న గాయాలు చూస్తుంటే ఇది కూడా నరబలిలో భాగమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
6000 ఏళ్ల నాటి చారిత్రక ప్రాంతం:
ఈ అస్థిపంజరం లభించిన కొండ ప్రాంతం గత 6,000 సంవత్సరాలుగా మానవ జీవనానికి కేంద్రంగా ఉంది. ఇక్కడ అంతకుముందు కూడా సాల్జ్ముండే సంస్కృతికి చెందిన కాలిన ఇళ్ళు, జంతువుల ఎముకలు లభించాయి. అంటే ఈ స్థలాన్ని ప్రాచీన కాలంలో పూజలు, బలులు ఇవ్వడానికి ఉపయోగించేవారని స్పష్టమవుతోంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ అస్థిపంజరానికి DNA మరియు రసాయన పరీక్షలు నిర్వహిస్తున్నారు, తద్వారా ఈ 5,000 ఏళ్ల నాటి మిస్టరీ వీడే అవకాశం ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..