కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD-టీటీడీ) నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి తిరుమలకు వస్తున్న లక్షలాది మంది భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదం ఉచితంగా అందిస్తున్న టీటీడీ సేవాభావానికి ప్రతీకగా నిలుస్తోంది. 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైన నిత్య అన్నదాన పథకం ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో నిర్వహించబడుతోంది. సాధారణ రోజుల్లో సుమారు 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండగా వారాంతాల్లో ఆ సంఖ్య కాస్త 3 లక్షలకు మించి ఉంటుంది.
రోజుకు 3 లక్షల సర్వింగ్స్..
గత మూడు నెలల సగటు గణాంకాలను పరిశీలిస్తే రోజుకు సుమారు 70 వేల మందికి పాలు, టీ, కాఫీ వంటి పానీయాలను టీటీడీ అందిస్తోంది. అలాగే 60,200 మందికి అల్పాహారం, 99,500 మందికి మధ్యాహ్న భోజనం, 56,700 మందికి రాత్రి భోజనం వడ్డిస్తోంది. ఈ విధంగా రోజుకు దాదాపు 3 లక్షల సర్వింగ్స్ భక్తులకు అందుతున్నట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి.
ఇక ప్రధాన అన్నప్రసాద భవనం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో రోజుకు 82 వేల మందికి పైగా భోజనాలు అందుతున్నాయి. శ్రీ అక్షయ కిచెన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కాంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్ల వెలుపల ఏర్పాటు చేసిన కేంద్రాలు, PAC అన్నప్రసాద భవనాలు తదితర ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులకు ఆహారం, పానీయాలను టీటీడీ కల్పిస్తోంది.
15.8 టన్నుల బియ్యంతో భక్తులకు నాణ్యమైన ఆహారం..
శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ రోజుకు సుమారు 15,788 కిలోల బియ్యం వినియోగిస్తోంది అదేవిధంగా 3,110 కిలోల సన్ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సుజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,729 కిలోల మినప్పప్పు, 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండు వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే రోజుకు 4,375 కొబ్బరికాయలు, 430 కిలోల చక్కెర, 309 కిలోల ఎండు మిర్చి, 209 కిలోల ధనియాలు తదితర ముడి పదార్థాలు ఉపయోగిస్తోంది.
ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 4.40 కోట్లకుపైగా సర్వింగ్స్..
2026 జనవరి 1 నుంచి మే 31 వరకు తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా మొత్తం 4.40 కోట్ల సర్వింగ్స్ భక్తులకు అందించినట్లు టిటిడి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో జనవరిలో కోటి, ఫిబ్రవరిలో 71.39 లక్షలు, మార్చిలో 84.85 లక్షలు, ఏప్రిల్లో 85 లక్షలు, అలాగే మే నెలలో 92 లక్షలకు పైగా భక్తులకు అన్నప్రసాదం, అల్పాహారం, పానీయాలు అందించింది.
ఆధునికీకరణతో విస్తరిస్తున్న సేవలు..
అన్నప్రసాదం నాణ్యతను మరింత మెరుగు పరిచేందుకు టీటీడీ పలు ఆధునిక చర్యలు చేపట్టింది. చట్నీలు, కూరల తయారీలో తాజా కొబ్బరికాయల వినియోగాన్ని ప్రవేశపెట్టింది. 2024లో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ను ప్రారంభించి అదనంగా 28 ప్రాంతాలకు ఆహార పంపిణీ సేవలను విస్తరించింది.
అదేవిధంగా నూతనంగా ప్రారంభించిన PAC-5 వెంకటాద్రి నిలయంలో సుమారు 1,500 మంది ఒకేసారి భోజనం చేసే సామర్థ్యంతో కొత్త డైనింగ్ హాల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 2 లక్షల మంది భక్తులకు ఆహారం తయారు చేయగల సామర్థ్యంతో కొత్త శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్ నిర్మాణానికి చర్యలు కొనసాగిస్తోంది. MTVAC కిచెన్లో ఆధునిక వంట పరికరాల ఏర్పాటు, QR కోడ్ ఆధారిత విరాళాల సేకరణ కియోస్క్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది.
రూ.2,500 కోట్లకు పైగా ఫిక్సిడ్ డిపాజిట్లు..
ఇక భక్తుల విరాళాలతో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ వద్ద ప్రస్తుతం రూ.2,500 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లను విరాళాల ద్వారా స్వీకరించింది. ఈ నిధుల ఆదాయంతో లక్షలాది మంది భక్తులకు నిత్యం ఉచితంగా నాణ్యమైన భోజనం అందిస్తూ టీటీడీ అన్నదానం మహాదానమన్న భారతీయ సనాతన సంప్రదాయాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తోంది. శ్రీవారి సన్నిధిలో ఆకలితో వచ్చే ప్రతి భక్తునికి తృప్తికరమైన భోజనం అందించడం ద్వారా టీటీడీ అన్నప్రసాద సేవలు ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది.







